Sunday, June 30, 2013

సదాశివబ్రహ్మేంద్రస్వామి

సదాశివబ్రహ్మేంద్రస్వామి వారు తమిళనాడు లో జన్మించిన మహాత్ముడు.

వీరి తండ్రిగారి పేరు మోక్షసోమసుందర అవధాని.
వీరు రామ,కృష్ణులను పూజించేవారు.వీరి భార్య పేరు పార్వతి .ఈమె శివుడిని పూజించేది.అందువలన వీరు తమకు కలిగిన కుమారుడికి శివరామకృష్ణ అని పేరు పెట్టారు.

ఇతను చిన్నప్పటి నుండే మిగతా పిల్లల కంటే తేడాగా ఉండేవాడు.వైరాగ్యం మొదలగు భావాలు ఉండేవి.అందువలన పెళ్ళి చేస్తే అంతా సరిపోతుందని వీరి తల్లిదండ్రులు భావించారు.మొదట స్వాములవారు వ్యతిరేకించినా ఒక కుమారుడిగా వారు చూసిన అమ్మాయిని 17 సంవత్సరాల వయస్సు లో పెళ్ళాడాడు.

కానీ అతను ఏ మాత్రం మారలేదు.అతనిలో వైరాగ్య భావాలు దృఢంగా ఉన్నాయి.ఇలా ఉండగా అతని భార్య పుష్పవతి అయ్యింది( ఆ కాలం లో బాల్యవివాహాల ఆచారం ఉండేది).మొదతిరాత్రిని స్వామిగారి మామగారింట్లో చేయాలని అందుకు తగ్గ వంటావార్పూ,సంభారాలు మొదలు పెట్టారు.స్వామికి విపరీతంగా ఆకలి అయ్యి వంటగది వద్దకు వెళ్ళి "నాకు ప్రత్యేక వంటకాలు అవసరం లేదు.ఏదుంటే అది పెట్టండి తినడానికి"అన్నాడు.అప్పుడు వారి అత్తగారు"దయచేసి కొద్దిసేపు వేచిఉండండి.మీరు ఎక్కువసేపు వేచి ఉండనవసరం లేదు.లోనికిరావద్దు.బయటనే ఉండండి "అన్నది.

"లోనికిరావద్దు.బయటనే ఉండండి" అన్న మాటలు స్వామిలో అనుకోని మార్పును వెంటనే తీసుకుని వచ్చింది."గృహస్థాశ్రమం లోకి రావద్దు.బయటనే ఉండి జ్ఞానాన్ని పొందు" అని స్వామివారు అర్థం చేసుకున్నారు.ఆకలినే తీర్చలేనివాళ్ళు తనకు జ్ఞానాన్ని ఎలా ఇవ్వగలరు?అని అనుకుంటూ స్వామి అక్కడినుండి వెల్లిపోయారు.బందువులు అతన్ని కనుగొనలేకపోయారు.

అతను తర్వాత అడవులలోనూ,నదీ తీరాలలోనూ గడిపాడు.భిక్షాటన చేసుకుని ఆకలి తీర్చుకునేవాడు.తనకే ఉండడానికి ప్రదేశంలేనివాడు దేవుడికి ఎక్కడ ప్రదేశం చూపించి పూజించాలి?అందువలన తన హృదయంలో పూజించేవాడు.ఈ మానసిక పూజను తన "శివ మానసికపూజ" అను స్తోత్రంలో వర్ణించాడు.

"ఓ శివా! అంతటా నీవి వ్యాపించిఉన్నావు.నిన్ని నేనెక్కడ పూజించగలను?ఆకాశమే నీ వస్త్రాలైనప్పుడు నీకు నేను ఏ వస్త్రం ఇవ్వగలను?"అంటూ స్తోత్రం చేశాడు.

ఈ హృదయవిదారక ప్రార్ఠన విని శివుడు స్వామివారికి కామకోటిపీఠంకు చెందిన పరమశివేంద్రసరస్వతి ని గురువుగా పంపాడు.గురువుగారు స్వామిని చూసి అతని లోని చైతన్యాన్ని గుర్తించి "సదాశివా"అంటూ పిలిచాడు.అప్పటి నుండి "శివరామకృష్ణ" పేరు "సదాశివ"అయ్యింది.వారి పీఠం పేరు కలుపుకొని "సదాశివబ్రహ్మేంద్రసరస్వతి" అయ్యింది.తన గురువుగారిని ఎంతగానోసేవించి అనేక కీర్తనలు,స్తోత్రాలు బ్రహ్మసూత్రాలకు పాతంజలయోగసూత్రాలకు వ్యాఖ్యానం చేసాడు.అన్నిటిని తన గురువుకు అంకితం చేసాడు.తన స్తోత్రాలకు మకుటం గా "పరమహంసగురు" అని ఎంచుకున్నాడు.
స్వామివారు ఎంతోమందితో వాదించి అందరినీ ఓడించేవాడు.ఒకసారి ఇలా ఓడిన పండితుడు గురువుగారికి ఫిర్యాదు చేసాడు.అప్పుడు గురువు గారు" ఓ! సదాశివా! నీవు ఎప్పుడు నిశ్శబ్దంగాఉంటావు?"అన్నాడు.మీ అనుగ్రహంతో ఇప్పుడే అంటూ సదాశివులవారు అన్నారు.గురువుగారి నుండి వెళ్ళిపోయి తను మౌనంలో అనుభవించిన అనుభవాలను తన కీర్తనల్లో వర్ణించాడు.లౌకిక విషయాలను వదిలి పెట్టి తనలోనే ఆత్మజ్ఞానాన్ని అనుభవిస్తూ ,తన దగ్గరకు వచ్చింది తింటూ జీవించాడు.

ఒకసారి ఈవిధంగా సమాధిస్థితిలో ఒక గడ్డివాము దగ్గర నిలిచున్నాడు.ఆ వాము యజమాని స్వామిని ఒక దొంగ అనుకొని కొట్టబోయాడు.వెంటనే అతను శిలావిగ్రహంలా ఉండిపోయాడు.స్వామికి ఇవేమీ తెలియదు.మరుసటి ఉదయం మెలకువలోనికి వచ్చినప్పుడు నవ్వుతూ ఆ రైతు వంక చూడగా ఆశ్చర్యకరంగా అతను మళ్ళీమామూలుగా అయ్యాడు.క్షమాపణ ఆడిగాడు.స్వామి నవ్వుతూ వెల్లిపోయాడు.ఒకసారి ఇదేవిధంగా సమాధిస్థితిలో కావేరి నదీతీరంలో ఉన్నప్పుడు వరదలు వచ్చి కొట్టుకుపోయాడు.మూడునెలల తర్వాత రైతులు ఇసుకమేటలు తొలగిస్తున్నప్పుడు ఒక గడ్డపార తగిలి స్పృహలోకి వచ్చి ఏమీజరగనివాడిలా వెళ్ళిపొయాడు.ఇలాంటి మహిమలెన్నో స్వామిజీవితంలో జరిగాయి.

చివరికి స్వామివారు తమిళనాడులోని నేరూరు లో స్థిరపడ్డారు.అక్కడి రాజు స్వామి ఉపదేశాలను పాటించి పరిపాలన చేసాడు.ఇప్పటికీ తమిళనాడు లో స్వామి కీర్తనలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.

స్వామి వారి ఉపదేశం " నీవుకోరుకున్నది చేయవద్దు.అప్పుడు నీకు నచ్చినది చేయవచ్చు" అని.

స్వామివారు నేరూరులోనే సమాధి పొందారు.
(పరమహంస యోగానంద గారి ఒకయోగి ఆత్మకథ లో స్వామివారి కొన్ని వివరాలు పొందుపరచబడ్డాయి) 

Thursday, June 27, 2013

త్రైలింగస్వామి

త్రైలింగస్వామి 1601 వ సంవత్సరం లో ఆంధ్రదేశం లో జన్మించి సుమారు 280 సంవత్సరాలు జీవించిన మహాత్ముడు.వీరి తల్లిదండ్రులు నరసింగరావ్,విద్యావతి.స్వామి వారు శివుడి అవతారంగా చెప్పబడ్డారు.

స్వామివారికి తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరాం.స్వామి చిన్నప్పటినుండే మిగతా పిల్లల లాగ ఆటపాటలలో పాల్గొనకుండా ఎప్పుడూ ఏకాంతం కోరుకునేవాడు.తన తల్లి చెప్పే రామాయణ,మహాభారతాలు మొదలైన మతగ్రంథాలు ఎంతో ఆనందంగా వినేవాడు.ఇతను తన తల్లిదండ్రుల సేవలో 52 సంవత్సరాలు గడిపాడు.అప్పుడు తన తల్లి మరణించగా గురువును వెదుకుతూ ఇల్లు వదలిపెట్టి వెళ్ళిపోయాడు.తన సాధనను తన ఊరి శ్మశానంలో ప్రారంభించాడు.తర్వాత అతను నేపాల్ తో సహా చాలా ప్రదేశాలు తిరిగి చివరికి కాశి చేరుకొని అక్కడ సుమారు 150సంవత్సరాలు పైన ఉన్నాడు.

స్వామివారు కేవలం ఆకులూఅలములు,పండ్లుఫలాలు తిని సంవత్సరానికి ఒక పౌండు చొప్పున పెరిగి 300 పౌండ్ల బరువుకి పెరిగినట్టు చెపుతారు.

స్వామివారు ఎన్నోవిషపూరిత ద్రవాలు త్రాగికూడా ఎటువంటి తేడా లేకుండా ఆరోగ్యంగా ఉండేవారు.వేలాదిప్రజల సాక్షిగా రోజుల తరబడి గంగానది పై తేలుతూ ఉండేవారు.ఒక్కొక్క సారి నీటిపై కూర్చుని ప్రజలకు కనిపించేవారు.ఒక్కొక్కసారి నీటిలోపల ,అలలక్రింద రోజుల తరబడి ఉండిపొయేవాడు.వేసవికాలం లో మిట్టమధ్యాహ్నం మణికర్ణికాఘాట్ లో ఎర్రగా కాలే ఇసుక పై స్వామి పడుకోవడం ,స్వామికి ఏమీకాకుండా ఉండటం చూడటం అక్కడి ప్రజలకు అలవాటే.

స్వామివారు అద్వైతఙ్ఞానసిద్ది పొందారనడానికి క్రింది సంఘటన ఉదాహరణగా నిలుస్తుంది.

స్వామి వారు విషపూరితద్రవాలు త్రాగి కూడా ఏమీకాకుండాఉండడం చూసి ఒక వ్యక్తి స్వామివారు అబద్దాలకోరు అని ఋజువుచేయడానికి ఒకరోజు ఒక కుండ నిండా సున్నం తీసుకుని స్వామివారికి అందులో పెరుగు ఉందని చెప్పి ఇచ్చాడు.సర్వజ్ఞులైన స్వామివారు మారుమాటాడకుండా త్రాగినారు.
త్రాగిన వెంటనే ఇచ్చిన అతను కడుపులో మంట అంటూ పొర్లాడసాగాడు.స్వామివారిని కరుణించమన్నాడు.అప్పటికి ఎన్నోరోజుల నుండి మౌనంలో ఉన్న స్వామి తన మౌనం విరమించి "ఓయి ధూర్తుడా!సర్వ ప్రాణులలో ఉన్న ఆ పరబ్రహ్మమే నా కడుపులో కూడా ఉన్నాడన్న జ్ఞానం నాకు ఉంది కాబట్టే నేను నీవిచ్చిన విషపూరిత సున్నం త్రాగి కూడా బ్రతికినాను.ఇంకెప్పుడు ఇలా చేయవద్దు.వెళ్ళీపో"అన్నాడు.ఆ ఇచ్చిన వ్యక్తి బ్రతుకుజీవుడా అనుకుంటూ వెళ్ళిపోయాడు.

స్వామి వారు ఎప్పుడూ దిగంబరంగా ఉండేవారు.అప్పటి ఆంగ్లేయులకు ఇది చాలా కష్టంగా ఉండేది.అందువలన ఎన్నోసార్లు స్వామిని పట్టుకొని కారాగారంలో పెట్టారు.కానీ స్వామివారిని పెట్టిన నిమిషం లోపే స్వామివారు కారాగారపు పైకప్పులపైన పచార్లు చేస్తూ కనిపించేవారు.ఒక సారి స్వామివారిని న్యాయస్థానం లో హాజరుపరిచారు.అక్కడి న్యాయమూర్తి స్వామివారితో "మీరు అన్నిటిలో దేవున్ని చూస్తున్నారని చెప్పారు కదా.అలా ఐతే నీ మలం నీవే తినగలవా?"అని ప్రశ్నించాడు.స్వామివారు ఏ మాత్రం సంకోచించకుండా అక్కడే మలవిసర్జన చేసి తన మలం తనే తిన్నాడు.ఆశ్చర్యకరంగా స్వామివారి మలవిసర్జన తర్వాత న్యాయస్థానం అంతా సుగంధభరితం అయ్యింది.ఈ దెబ్బతో స్వామి వారిపై ఆంగ్లేయులు మరెప్పుడూ ఫిర్యాదు పెట్టలేకపోయారు.

ఇలా స్వామివారి జీవితంలో ఎన్నో మహిమలు జరిగాయి.

స్వామివారు పుష్యశుక్లఏకాదశి నాడు (26-12-1887) నాడు సమాధి పొందారు.వీరి సమాధి కాశి లో పంచగంగఘాట్ లో ఉంది.

స్వామి వారిని దర్శించిన మహాత్ములు: శ్రీరామకృష్ణపరమహంస,శారదామాత,స్వామి వివేకానంద,పరమహంస యోగానంద,నరసింహ యోగీంద్రులు మొదలగువారు.
క్రియాయోగాన్ని బాబాజి ద్వారా గ్రహించి ప్రపంచానికి అందించిన లాహిరీ మహాశయులు త్రైలింగస్వామికి అత్యంత ఆప్తమిత్రులు.

Wednesday, June 26, 2013

మహోన్నత ఋషివర్యులకు, మహాయోగులకు శతకోటి వందనాలు

గణేశ ప్రార్థన:

వక్రతుండమహాకాయ సూర్యకోటి సమప్రభ,
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

సనాతనమైన మన భారతదేశము ప్రపంచానికి ఎన్నో కానుకలు అందించింది. విజ్ఞాన శాస్త్రములలో ,గణితశాస్త్రం లో ఐతేనేమి ఎందఱో మహానుభావుల ద్వారా ఏంటో సేవ చేయించింది . ఆర్యభట,భాస్కరాచార్య,బ్రహ్మగుప్త మొదలగు వారు గణితశాస్త్రం లో శాస్త్రవేత్తలైతే చరక,సుశ్రుత మొదలగు వారు వైద్యశాస్త్రంలో ఇంకా అనేకానేకులు విజ్ఞాన శాస్త్రానికి ఎన్నో సేవలు అందించారు .

ఇక ఆధ్యాత్మిక విజ్ఞానములో భారతదేశము  ప్రపంచానికే మకుటంలేని మహా సార్వభౌమ చక్రవర్తి.
ఈ బ్లాగులో మన భారత యోగుల, మహర్షుల గురించి సంక్షిప్త చరిత్రలు వ్రాయాలని నా సంకల్పము.
ముఖ్యంగా ఆధునిక కాలానికి చెందిన యోగుల గురించి వ్రాయాలని సంకల్పము.
భగవంతుడి దయ మేరకు వ్రాస్తాను.